Home Page SliderNational

కట్లు కడుతుండగా డాక్టర్‌ను పొడిచి చంపిన పేషెంట్

Share with

కేరళలో దారుణం జరిగింది. హౌస్ సర్జన్ చేస్తున్న వందన దాస్ అనే 23 ఏళ్ల డాక్టర్‌ను అతి దారుణంగా పొడిచి చంపాడు పేషెంట్. ఎర్నాకులంలోని జిల్లా ఆసుపత్రికి 42 ఏళ్ల గాయాలతో ఉన్న సందీప్ అనే ఖైదీని తీసుకునివచ్చారు పోలీసులు. అతని గాయాలకు కుట్లు వేసే సమయంలో అతడు అతి కిరాతకంగా, అకస్మాత్తుగా పక్కనే ఉన్న కత్తెర, కత్తులు తీసుకుని వందన దాస్ అనే యంగ్ డాక్టర్‌పై పలుమార్లు దాడిచేశాడు. అడ్డువచ్చిన మరో ఐదుగురిపై కూడా విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు. ఆమెను వెంటనే ప్రైవేట్ హాస్పటల్‌కు తరలించినా లాభం లేకపోయింది. ఆమె మరణానికి కారణమైన ఈ దాడిపై పలువురు డాక్టర్లు సమ్మె మొదలు పెట్టారు. డాక్టర్‌లకు రక్షణ లేదని మండిపడుతున్నారు. హింసా ప్రవృత్తి గల ఖైదీలను తీసుకువచ్చేటప్పుడు చేతులకు సంకెళ్లు వేసి ఉంచాలని పేర్కొన్నారు. సందీప్ అనే ఈ  ఖైదీకి హింసాప్రవృత్తి చాలా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. అంతకు ముందే అతనిని, పలువురిపై దాడిచేసిన ఘటనలో అరెస్టు చేసిన పోలీసులు ఎలాంటి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా హాస్పటల్‌కు తీసుకువచ్చారని ఆరోపిస్తున్నారు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఒక నిండు ప్రాణం పోయిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.