Home Page Slider

వైఎస్ షర్మిల తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తుందా?

Share with

వైఎస్సార్‌టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పరిస్థితి అయోమయంగా మారింది. ఆమె తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తుందా? తమ పార్టీ తరపున అభ్యర్థులను నిలబెట్టనున్నారా? అనేది సస్పెన్స్‌గా మారింది. ఎందుకంటే కాంగ్రెస్‌లో ఆమె పార్టీ విలీనం చేయబోతోందనే వార్తలు గతంలో హల్‌చల్ చేశాయి. కానీ ఇప్పుడు అది జరిగేలా కనిపించడం లేదు. ఈ విషయంపై వారి మధ్య ఏకాభిప్రాయం కుదరలేనట్లే భావించాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులతో పలుమార్లు ఆమె సమావేశమైనా ఈ విషయంపై కాంగ్రెస్ హై కమాండ్ నుండి కానీ, షర్మిల నుండి కానీ ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

ఇప్పుడు తెలంగాణాకు ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల అయ్యింది. అధికార బీఆర్‌ఎస్ పార్టీపై అనేక ఆరోపణలు చేస్తూ తాను తెలంగాణ కోడలినని, బిడ్డనని తనకూ ఇక్కడ పోటీ చేసే హక్కు ఉందని ఎన్నో సార్లు ప్రకటించారు షర్మిల. ఇప్పుడు షర్మిల ఒంటరిగా తన పార్టీ తరపున పోటీ చేసి, అనంతరం కాంగ్రెస్‌లో విలీనం చేస్తారా? అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఆమె గతంలో పాలేరు లేదా సికింద్రాబాద్ నుండి పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. లేదా ఈసారి ఎన్నికల బరిలో పోటీ చేయకుండా పార్టీని బలోపేతం చేసుకోవాలా? అనే రెండు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకునే అవకాశం ఉంది. త్వరలోనే ఆమె ఈ విషయంలో ప్రెస్‌మీట్ పెట్టి ప్రకటించే అవకాశం ఉంది.