హరిహర వీరమల్లుని పవన్ పూర్తి చేస్తారా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ గురించి నిర్మాత ఏఎం రత్నం కొత్త అప్డేట్స్ ఇచ్చారు. “జనసేన పార్టీ నాయకుడిగా ఆంధ్రప్రదేశ్లో రికార్డు విజయాన్ని సాధించి, డిప్యూటీ సీఎంగా ఎన్నికైన పవన్ కళ్యాణ్ తిరిగి సినిమా షూటింగులో పాల్గొంటారా ఈ చిత్రాన్ని పూర్తి చేస్తారా”? అంటూ నెటిజన్లు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు నిర్మాత. ఈ చిత్రం షూటింగులో పవన్ కళ్యాణ్కు చెందిన షూటింగ్ పార్టు చాలావరకూ అయిపోయిందన్నారు. మరో 20 రోజుల సమయం కేటాయిస్తే ఈ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేసేస్తామని, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చాలా బిజీ షెడ్యూల్లో ఉన్నారని, ఆ ప్రకారమే షూటింగ్ ప్లాన్ చేస్తామన్నారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2024/06/image-222-1024x536.png)
ఈ చిత్రం ఓటీటీ రైట్స్ కోసం అమెజాన్ ప్రైమ్తో ఒప్పందం చేసుకున్నామన్నారు. అక్టోబరులో విడుదల కావలసిన ఈ చిత్రాన్ని ఎలాగైనా డిసెంబరుకు విడుదల చేసేలా చూసుకుంటామని, అంతవరకూ అమెజాన్ ప్రైమ్ను సమయం అడుగుతామన్నారు. ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, గ్రాఫిక్స్ వర్క్ ఇరాన్లో జరుగుతోందన్నారు. కుస్తీ పోటీలకు సంబంధించిన వీఎఫ్ఎక్స్ పనులు బెంగళూరులో, చార్మినార్ ఎపిసోడ్ హైదరాబాద్లో జరుగుతున్నాయి. పవన్ యాక్షన్ సీన్స్ ఈ చిత్రానికే హైలైట్ అవుతాయని ఏఎం రత్నం పేర్కొన్నారు. మొదట ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించారు. సినిమా ఆలస్యం కావడంతో ఆయన వేరే ప్రాజెక్టులకు వెళ్లిపోయారు. దీనితో ఆయన స్థానంలో నిర్మాత ఏఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.