గొంతు నొక్కుతున్నారు… గద్దె దించే వరకు విశ్రమించను-ఈటల శపథం
బీజేపీ సీనియర్ నేత, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో సర్కారు అదే వైఖరి అవలంబిస్తోంది. ఈటల రాజేందర్ను అసెంబ్లీలో చూడకూడదనుకున్న సీఎం కేసీఆర్ అదే పంథా అనుసరిస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో ప్రజలు ఆశీర్వదించి… అఖండ మెజార్టీతో గెలిపించడంతో… సీఎం కేసీఆర్ సతమతమవుతున్నారు. అసెంబ్లీలో ఈటలను చూడకూడదనుకున్నా… ఆయన ప్రజల మద్దతుతో విజయం సాధించడం టీఆర్ఎస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. అసెంబ్లీలో అకారణంగా ఈటల రాజేందర్ను ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యేవరకు సస్పెన్షన్ వేటు వేసింది అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం. అసెంబ్లీలో ఉన్న ఈటల రాజేందర్ను బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించి తీసుకెళ్లారు.
![](http://www.manasarkar.com/wp-content/uploads/2022/09/dddddddddddddd-e1663047017258.png)
ప్రభుత్వ తీరుపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు బానిసలా వ్యవహరించవద్దని మండిపడ్డారు. టీఆర్ఎస్ సర్కారు తీరును దారుణంగా ఉందంటూ రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ నాశనానికి ఇదంతా చేస్తున్నారని… సంవత్సర కాలంగా కుట్రలు చేస్తూనే ఉన్నారంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేగా తిరిగి గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు అసెంబ్లీకి హాజరుకాకుండా చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యే గొంతు నొక్కుతున్నారని… టీఆర్ఎస్ పార్టీని గద్దె దించే వరకు విశ్రమించబోనన్నారు. సర్కారు తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్నారు ఈటల రాజేందర్.