Andhra PradeshPolitics

రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా? అని అనిపిస్తోంది: వసంత కృష్ణ ప్రసాద్

Share with

మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీకి వ్యతిరేకంగా ఆయన వ్యాఖ్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుత రాజకీయాలు చాలా మారిపోయాయని…పది మంది పోరంబోకులను వెంటేసుకుని తిరిగితేనే నాయకుడిగా ముందుకు సాగే పరిస్థితి ఉందని… అది చేతకాక తాను పాత తరం నాయకుడిగానే మిగిలిపోయానని చెప్పారు. గత మూడున్నరేళ్ల కాలంలో ప్రతిపక్షాలపై తాను అక్రమ కేసులు పెట్టించలేదని… ఈ విషయంలో తనపై తమ పార్టీలోని కొందరు నాయకులకు అసంతృప్తి ఉండొచ్చని తెలిపారు.

రౌడీలను వెంటేసుకుని ఇతర ఎమ్మెల్యేల మాదిరి ప్రవర్తిస్తేనే రాజకీయాల్లో ముందడుగు వేసేలా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లోకి ఎందుకొచ్చానా, ఎమ్మెల్యే ఎందుకయ్యానా అని ఒక్కోసారి అనిపిస్తుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా ఉండి కూడా సాటి వ్యక్తులకు సాయం చేయలేకపోతున్నానని వాపోయారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం జగన్ ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని… వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

గుంటూరులో ఇటీవల నిర్వహించిన టీడీపీ సభలో చోటుచేసుకున్న తొక్కిసలాటపై ఆయన స్పందిస్తూ… సేవాకార్యక్రమాలను చేసే వారిని విమర్శించడం సరికాదని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనుకునే ఎన్నారైలను ఆపడం మంచి పద్ధతి కాదని చెప్పారు. ఉయ్యూరు ఫౌండేషన్ నిర్వాహకుడు, ఎన్నారై ఉయ్యూరు శ్రీనివాస్ తనకు మంచి స్నేహితుడని, చాలా మంచి వ్యక్తి అని అన్నారు. అతడిపై అక్రమ కేసులు పెడితే ఎన్ఆర్ఐలు ఎవరు పెట్టుబడి పెట్టేందుకు వస్తారని వసంత కృష్ణ ప్రసాద్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.