ఆధార్ కార్డులు కావాలని వచ్చి బాలికపై వాలంటీరు అత్యాచారం
ఏలూరు, దెందులూరు: వాలంటీరు తమ బిడ్డ జీవితాన్ని పాడు చేశాడని, న్యాయం చేయాలని బాలిక తల్లిదండ్రులు ప్రాధేయపడినా పోలీసులు కనికరించలేదు. పరారీలో ఉన్న నిందితుడిని మీరే పట్టుకురావాలంటూ వారికి సలహా ఇచ్చారు. నిందితుడికి వైకాపా నాయకుల అండ ఉండటంతోనే పోలీసులు పట్టించుకోవట్లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో పదోతరగతి చదువుతున్న బాలికపై వాలంటీరు అత్యాచారం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులకి వచ్చింది. బాధిత బాలిక బంధువులు తెలిపిన వివరాలిలా..
వాలంటీరు నీలాపు శివకుమార్ బాలిక వెంటపడి వేధించేవాడు. రెండు నెలల క్రితం ఎవరూ లేనప్పుడు తల్లిదండ్రుల ఆధార్ కార్డులు కావాలని ఇంట్లోకి వెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. తల్లిదండ్రులకు చెబితే చంపేస్తానంటూ తర్వాత పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. పాఠశాలకు సెలవులు రావడంతో బాలిక తన పెద్దమ్మ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెకు డాక్టరుతో పరీక్షలు చేయించగా బాలిక గర్భవతి అని తేలడంతో తల్లిదండ్రులకు తెలిసివారు వాలంటీరును నిలదీశారు. దీంతో అతను రూ.10 వేలు ఇస్తాను.. కడుపు తీయించుకోవాలని చెప్పగా, రెండు కుటుంబాల మధ్య వివాదం జరిగింది. పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టడంతో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఏర్పాట్లు చేసుకున్నాక పెళ్లికి ముందురోజు పరారయ్యాడు.
ఫిర్యాదు తీసుకోని దిశ స్టేషన్: బాలిక తల్లిదండ్రులు ఏలూరు దిశ పోలీస్ స్టేషన్కు వెళ్లగా.. అధికారులు లేరంటూ ఫిర్యాదు తీసుకోలేదు. దెందులూరు పోలీస్ స్టేషన్కు వెళ్లినా.. కేసు నమోదుకు తాత్సారం చేశారు. చాలాకాలం పోలీసులు పట్టించుకోకపోవడంతో బాధితులు జగనన్నకు చెబుదాం, స్పందన, 112కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు అక్టోబర్ 5న కేసు నమోదు చేశారు. దర్యాప్తులో కాలయాపనపై పోలీసులను బాలిక బంధువులు అడగగా.. మీరే నిందితుడిని వెతికి పట్టుకొస్తే తాము చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వారు నిర్ఘాంతపోయారు. వాలంటీరుకు స్థానిక వైకాపా నాయకుడి అండ ఉండటంతో పోలీసులు చర్యలు తీసుకోవటం లేదని, కేసు నమోదుకు కూడా తీవ్ర జాప్యం చేశారని వారు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై ఏలూరు ఎస్పీ మేరీ ప్రశాంతిని వివరణ కోరగా దిశ పోలీస్ స్టేషన్లో అధికారులు లేని విషయం వాస్తవమే. బాలికపై వాలంటీరు అత్యాచారం చేసిన విషయం నా దృష్టికి రాలేదు. సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం అని తెలిపారు.