ఉద్దేశపూర్వకంగానే విజయ్ మాల్యా పారిపోయాడు : సీబీఐ
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పరారైన విజయ్ మాల్యా ఎపిసోడ్పై సీబీఐ కీలక విషయాలు వెల్లడించింది. తాజాగా ముంబై కోర్టులో సప్లిమెంటరీ ఛార్జ్షీట్ దాఖలు వేసింది. అందులో విస్తుపోయే విషయాలను పేర్కొంది. విజయ్ మాల్యా దేశం విడిచి పారిపోయే సమయంలో ఆయన వద్ద అప్పులు చెల్లించేందుకు సరిపోయే డబ్బు ఉందని పేర్కొంది. అయినా.. ఉద్దేశపూర్వకంగానే పారిపోయినట్లు తెలిపింది. ఆ డబ్బుతో యూరప్లో ఆస్తులు కొనుగోలు చేశాడని సీబీఐ ఛార్జీషీట్లో పేర్కొంది. అదే సమయంలో బ్యాంకులు సైతం ఆయన నుంచి లోన్లు రికవరీ చేయడంలో విఫలం అయ్యాయంటూ తెలిపింది. ఇంగ్లండ్, ఫ్రాన్స్ దేశాల్లో ఆయన 330 కోట్లు పెట్టి ఆస్తులను సొంతం చేసుకున్నట్లు తెలిపింది. ఐడీబీఐ – కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 900 కోట్ల రూపాయల లోన్ ఫ్రాడ్ కేసులో విజయ్ మాల్యా నిందితుడిగా ఉన్నాడు. 2016లో దేశం విడిచి పారిపోయిన మాల్యా… యూకేలో తలదాచుకున్నాడు. ఈ మేరకు అతన్ని వెనక్కి రప్పించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోంది.