24 మందితో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఏర్పాటు
లిక్కర్ స్కామ్ నిందితుడు శరత్ చంద్రారెడ్డికి చోటు
చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి భార్యకు స్థానం
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుల జాబితా శుక్రవారం విడుదల అయ్యింది. 24 మంది సభ్యులతో టీటీడీ పాలక మండలిపై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ బోర్డులో అన్ని సామాజిక వర్గాలు ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించారు.మహారాష్ట్ర నుంచి ముగ్గురు తమిళనాడు నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి ఇద్దరు సభ్యులతో పాటు కర్ణాటక నుంచి ఒకరికి బోర్డులో అవకాశం కల్పించారు.వై వి సుబ్బారెడ్డి నేతృత్వంలోని టీటీడీ పాలక మండలి పదవి కాలం ఈ నెల 8న ముగిసింది. ఆయన స్థానంలో చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ని ప్రభుత్వం నియమించింది. ఈ క్రమంలోనే పాలకమండలి ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియమించారు.
ఎమ్మెల్యే కోటాలో సామినేని ఉదయభాను(జగయ్యపేట), పొన్నాడ సతీష్(ముమ్మిడివరం), తిప్పేస్వామి(మడకశిర)కి అవకాశం దక్కింది. ఇక టీటీడీ సభ్యులుగా గోదావరి జిల్లాల నుంచి సుబ్బరాజు(ఉంగుటూరు).. నాగ సత్యం యాదవ్(ఏలూరు), ప్రకాశం జిల్లా నుంచి శిద్ధా సుధీర్(శిద్ధా రాఘవరావు కుమారుడు), కడప నుంచి యానాదయ్య.. మాసీమ బాబు, వై. సీతారామిరెడ్డి(మంత్రాలయం), శరత్, అశ్వద్థనాయక్లకు అనంతపురం నుంచి చోటు దక్కింది. అలాగే.. తమిళనాడు నుంచి డాక్టర్ శంకర్, కృష్ణమూర్తి, కర్ణాటక నుంచి దేశ్పాండే, తెలంగాణ నుంచి సీతా రంజిత్రెడ్డి( ఎంపీ రంజిత్రెడ్డి సతీమణి) , మహారాష్ట్ర నుంచి అమోల్ కాలే, సౌరభ్బోరా, మిలింద్ సర్వకర్లకు అవకాశం కల్పించారు.