మహరాష్ట్ర సరిహద్దుల్లో పులి పంజా
మహరాష్ట్ర సరిహద్దుల్లో పులి సంచారం స్థానికులను భయాందోళనకు గురిచేస్తోంది. ఒకే రోజు మూడు ప్రాంతాల్లో పులి దాడి చేయడం కలకలం రేపుతోంది. పశువుల మేత కోసం అడవికి వెళ్లిన కాపర్లపై పులి దాడి చేస్తోంది. పులి దాడిలో చంద్రపూర్ జిల్లాలోని ఇద్దరు పశువుల కాపరులు మృతి చెందారు. కొమరం భీం జిల్లాలో పులి దాడిలో మూడు పశువులు హతమయ్యాయి. కాగజ్నగర్ వేంపల్లి దగ్గర 2 పులులు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా అనుకొండలో పశువుల మందపై పులి దాడి చేయగా 2 పశువులు మృతి చెందాయి. రైలు పట్టాలపై నుంచి పులి వెళ్తుండగా రైలు సిబ్బంది గూడ్స్ రైలును స్లో చేశారు. ఈ నేపథ్యంలో రైలు పట్టాల దగ్గర పులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. ఈ విధంగా పులి తరచూ సంచరించడం ఆ ప్రాంతంలోని ప్రజలకు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. దీంతో పశువుల కాపరులు అడవికి వెళ్లాలంటే భయపడుతున్నారు. మరోపక్క అటవీశాఖ అధికారులు ఈ పులులను పట్టుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మహరాష్ట్ర సరిహద్దుల్లోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.