Home Page SliderTelangana

షేక్‌పేటలో విద్యుత్ ఘాతానికి ముగ్గురు బాలురు బలి

Share with

హైదరాబాద్‌లోని షేక్‌పేట్‌ పారామౌంట్ కాలనీలో నిన్న రాత్రి ఘోరం జరిగింది. ముక్కుపచ్చలారని ముగ్గురు యువకులను విద్యుత్ బలితీసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అన్నదమ్ములతో పాటు వారి స్నేహితుడు కూడా మరణించారు. ఆ కాలనీలో నివాసం ఉంటున్న అనస్ (19) వాటర్ సంప్‌ను క్లీన్ చేస్తుండగా, ఈ ప్రమాదం జరిగింది. మోటార్‌కు సంబంధించిన వైర్ ఊడిపోయిందని, అది తెలియని ఈ పిల్లలు స్విచ్ వేస్తుండగా కరెంట్ షాక్ తగిలింది. సంపులో ఉన్న అనస్ మొదటిగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. దానితో పక్కనే ఉన్న అతని తమ్ముడు రిజ్వాన్(18) కాపాడడానికి ప్రయత్నించారు. దీనితో అతడు కూడా షాక్‌కు గురయ్యాడు. వీరిని చూసి, వారి స్నేహితుడు రజాక్ (16) వారిని రక్షించబోగా అతనిని కూడా కరెంట్ కాటేసింది. దీనితో అక్కడికక్కడే వారు ముగ్గురూ చనిపోయారు. ఈ సమయంలో ఈ కాలనీలో అందరూ రంజాన్ పండుగ హడావుడిలో ఉండగా ఈ ప్రమాదం జరిగింది. వారి పవిత్రమాసమైన రంజాన్ సమయంలో ఇలా జరగడం, ఇంత చిన్న వయస్సులోనే వారికి నూరేళ్లు నిండిపోవడంతో వారి కుటుంబాల ఆవేదనకు అంతులేకుండా పోయింది. ఈ ఘటనపై స్థానికులు విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి మృతదేహాలను పోస్టుమార్టంకు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.