ప్రధాని మోదీని, యూపీ సీఎంను చంపేస్తానంటూ బెదిరింపులు
యూపీలోని గోరఖ్పూర్లో 45 ఏళ్ల ఒక వ్యక్తిని యూపీ పోలిసులు అరెస్టు చేశారు. ప్రధాని మోదీని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపేస్తానంటూ బెదిరింపు కాల్స్ చేశాడు ఒక వ్యక్తి. తన పేరు అరుణ్ కుమార్ అని, తనది గోరఖ్ పూర్ భుజౌలి కాలనీ అని చెప్పాడు. కానీ అతడి మొబైల్ లొకేషన్ను బట్టి అతడిది గోరఖ్ పూర్లోని హర్పూర్ బుద్హట్ వద్ద గల దేవగడ్ గ్రామం అని తెలుసుకున్నారు పోలీసులు. అతడి పేరు సంజయ్ కుమార్ అని, ఈ కాల్ చేసే సమయంలో బాగా మద్యం సేవించి ఉన్నాడని తెలియజేశారు. పోలీసుల ఇంటరాగేషన్లో బాగా తాగి, తానే ఆ ఫోన్ చేసినట్లు ఒప్పుకున్నాడు సంజయ్ కుమార్. దీనితో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి, విచారణ చేస్తున్నారు. జూన్లో కూడా ప్రధాని నరేంద్రమోదీని, హోం మంత్రి అమిత్ షాను, బీహార్ ముఖ్యమంత్రి నితిష్ కుమార్ను చంపేస్తానంటూ ఫోన్ చేసిన వ్యక్తిని కూడా పట్టుకున్నారు దిల్లీ పోలీసులు. సుధీర్ శర్మ అనే ఈ వ్యక్తి కూడా ఇలాగే మద్యం సేవించి ఇలాంటి ఫోన్ చేసినట్లు చెప్తున్నారు.