Andhra PradeshHome Page Slider

షేర్ ఆటోలో దోపిడీ దొంగల బీభత్సం

Share with

కాకినాడ జిల్లా సామర్లకోటలో ప్రయాణికుల వేషంలో దోపిడి దొంగలు షేర్ ఆటోలో ఎక్కి బీభత్సం సృష్టించారు. సామర్లకోట ఆటో స్టాండ్ నుండి, పిఠాపురానికి 8 మంది మహిళలతో ఆటో బయలుదేరింది. ఈ ఆటోలో మహిళలు ఉండడంతో దారిలో ఆపిన దొంగలు ప్రయాణికుల ముసుగులో ఆటో ఎక్కారు. ఆటో సామర్లకోట శివార్లు దాటగానే వారి నిజస్వరూపం బయటపెట్టారు. కత్తితో ఆటో డ్రైవర్‌ను బెదిరించి, పొడిచి ఆటో నుండి తోసేశారు. ఆటోను వారి స్వాధీనం చేసుకుని బయలుదేరారు. వారిలో ఒక మహిళ సహాయం కోసం ఫోన్ మాట్లాడేందుకు ప్రయత్నించగా ఆమెను కూడా గాయపరచి, ఆటో నుండి తోసేశారు. అనంతరం దగ్గరలోని పొలాలలోకి ఆటోను తీసుకువెళ్లి, మహిళలను డబ్బు, నగలు ఇమ్మని బెదిరించి, లాక్కున్నారు. వారిని అక్కడే వదిలేసి, పొలాల నుండి పారిపోయారు. గాయపడిన ఆటో డ్రైవర్‌ను, మహిళలను అటుగా వెళ్లే ప్రయాణికులు రక్షించారు. వారిని కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఆగంతకులు ఇద్దరూ హిందీలో మాట్లాడుతున్నారని, భాదితులు చెప్తున్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ దోపిడీ ఉదంతాన్ని విన్న పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు.