నా గన్మెన్ల తొలగింపు ప్రభుత్వ కుట్రే.
మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ తన గన్మేన్లను తొలగించడం ప్రభుత్వ కుట్రే అంటూ మండిపడ్డారు. ఆయనకు రెండు రోజుల క్రితం ప్రభుత్వం గన్మేన్లను తొలగించింది. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రోజులుగా గన్మేన్స్ రాకపోవటంతో ఏమిటని కన్నా లక్ష్మీనారాయణ ఆరా తీయగా, ఇది ప్రభుత్వ ఆదేశాలుగా తెలిసింది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కుట్రలో భాగంగానే తనకు గన్మెన్లను తొలగించారని ప్రభుత్వాన్ని గట్టిగా విమర్శించడం వల్లే ఇలాంటి చర్యలకు ప్రభుత్వం పాల్పడిందన్నారు. పల్నాడు జిల్లాలో భద్రతాపరంగా తనకు ఇబ్బందులు ఉన్నాకూడా గన్మేన్లను తొలగించడంపై మండిపడ్డారు. ప్రజలు జగన్ కు మంచి మెజార్టీ ఇచ్చిన ఉపయోగించుకోలేకపోయారని విమర్శించారు. జగన్ సీఎం అయ్యాక ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, దోపిడీ, హత్యలు తప్ప మరో కార్యక్రమం లేదన్నారు. జగన్ సైకో పాలనతో ప్రజలు విసిగిపోయారని, ఎంత త్వరగా ఎన్నికలు వస్తే అంత త్వరగా జగన్ ను ఇంటికి పంపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.