తెలంగాణాలో భారీగా పెరగనున్న పుస్తకాల ధరలు
తెలంగాణాలో పిల్లల చదువులు ఇకపై తల్లిదండ్రులకు పెను భారం కానున్నాయి. కాగా రాష్ట్రంలో 1 నుంచి 10 వ తరగతి వరకు పుస్తకాల ధరలు 40% నుంచి 50% వరకు పెరుగుతాయని విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రంలో ఇప్పటికే పెరిగిన స్కూల్ ఫీజులతో విద్యార్థుల తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. కాగా త్వరలో పుస్తకాల ధరలు కూడా పెంచుతున్నట్లు ప్రకటించడంతో విద్యార్థుల తల్లిదండ్రుల పరిస్థితి “మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు”గా తయారయ్యింది. అయితే ఏప్రిల్ 27 నాటికి కొత్త పుస్తకాలు మార్కెట్లో అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఈసారి వేసవి సెలవులు ఇచ్చేలోగా ఆయా జిల్లా కేంద్రాలకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో బడులు తెరవగానే విద్యార్థులకు పుస్తకాలు అందిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు.