వచ్చే నాలుగు రోజులూ దంచి కొట్టే ఎండలు
హైదరాబాద్: ఎండలు మండుతున్నాయి. మధ్యాహ్న వేళల్లో బయటకు రావడానికి జనం జంకుతున్నారు. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో ఎండల తీవ్రత సాధారణం కన్నా రెండు నుండి ఐదు డిగ్రీలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ను దాటాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్ల మండలం తిమ్మాపూర్లో 41.1 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. మరోవైపు రాత్రి పూట ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. ఆదివారం రాత్రి నుండి సోమవారం ఉదయం వరకు పటాన్చెరులో సాధారణం కన్నా 4.5 డిగ్రీలు పెరిగింది. ఆదిలాబాద్లో సాధారణం కన్నా 3.5, హయత్నగర్లో 3.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు పెరిగాయి.