Andhra PradeshHome Page Slider

అత్యంత కిరాతకంగా మహిళ దారుణహత్య

Share with

ప్రకాశం జిల్లా కనిగిరిలో ఒక వివాహితను దారుణంగా హత్య చేశారు దుండగులు. కారుతో తొక్కించి, బండరాళ్లతో మోది పాశవికంగా ప్రవర్తించారు. ప్రకాశం జిల్లా జిల్లెళ్లపాడు గ్రామానికి చెందిన కోట రాధ(35) అనే వివాహితను అప్పు తీరుస్తామంటూ పిలిపించి చంపేశారని ఆమె తలిదండ్రులు ఫిర్యాదు చేశారు. తన అల్లుడు, కుమార్తెలు కేతిరెడ్డి కాశిరెడ్డి అనే వ్యక్తికి 50 లక్షలు అప్పుగా ఇచ్చారని, అది తిరిగి అడిగినందుకు అతనే తన అనుచరులతో హత్య చేసి ఉంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆమె తండ్రి సుధాకర్ రెడ్డి. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఐన కోట మోహన్‌రెడ్డికి ఇచ్చి తన కుమార్తె రాధ వివాహం చేశామని తెలియజేశారు. రాధ బాల్యస్నేహితుడైన కాశింరెడ్డి ఉద్యోగం పోవడంతో, అతనికి వ్యాపారం చేసే నిమిత్తం తన కుమార్తె రాధ, అల్లుడు మోహన్ రెడ్డిలు అప్పుగా 50 లక్షలు ఇచ్చారని పేర్కొన్నారు.

ఈ నెల 11న రాధ తన పుట్టింటికి రాగా, బెంగళూరు నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి, కనిగిరి వస్తే మీ అప్పు కొంత చెల్లిస్తామని చెప్పడంతో అమె కనిగిరిలోని బాబాయి ఇంటికి చేరి, తన కుమారుడిని వారింట్లోనే వదిలి ఆ వ్యక్తి సూచించినట్లు పామూరు బస్టాండు చేరుకున్నారట. ఎంత రాత్రయినా ఆమె తిరిగి రాకపోవడంతో, ఫోన్ కూడా లిఫ్టు చేయకపోవడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే కనిగిరి పోలీసులు సెల్‌ఫోన్ టవర్ సిగ్నల్స్ ఆధారంగా రాధ జిల్లెళ్లపాడు సమీపంలోనే ఉందంటూ సమాచారమిచ్చారు. అయితే ఆమెను కనిపెట్టడంలో ఉదాసీనంగా వ్యవహరించారు. కనీసం వెలిగండ్ల స్టేషన్‌కు సమాచారమిచ్చినా తమ కుమార్తెపై ఈ దారుణం జరగకుండా ఉండేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. వారి అనుమానం అంతా అప్పు తీసుకున్న కాశిరెడ్డి పైనే మళ్లింది. ఈమెపై గుంపుగా దాడి చేసినట్లు శరీరంపై సాక్ష్యాలున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. కాశిరెడ్డి కోసం బెంగళూరుకు కూడా పోలీస్ బృందాలను పంపారు.