బాసర ట్రిపుల్ ఐటీలో ఘోరం- విద్యార్థిని ఆత్మహత్య
తెలంగాణాలో విద్యార్థుల ఆత్మహత్యలు బెంబేలెత్తిస్తున్నాయి. కారణం తెలియకుండానే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నేటి ఉదయమే బాచుపల్లి నారాయణ కాలేజ్ విద్యార్థిని హాస్టల్ భవనంపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగారెడ్డి జిల్లా కోటపల్లి మండలం గోరేకల్కు చెందిన దీపిక అనే పీయూసీ విద్యార్థిని బాసర ట్రిపుల్ ఐటీలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ రోజు ఉదయం ఫిజిక్స్ పరీక్ష రాసిన ఆమె తనకు ఆందోళనగా ఉందని తెలిపింది. దీనితో అధ్యాపకులు కౌన్సిలింగ్ ఇవ్వడానికి ప్రయత్నించగా, బాత్రూమ్కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. అనుమానంతో సిబ్బంది పరిశీలించగా బాత్రూమ్లోని ఎగ్జాస్టర్ ఫ్యాన్కు చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. ఆమెను హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.