దేశానికే ఆదర్శంగా “పల్లె దవాఖాన’’
• అందరికి ఆరోగ్యమే తెలంగాణా ప్రభుత్వ సంకల్పం
• పల్లె నుంచి పట్నం దాకా , పేదల నుంచి పెద్దల వరకు ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు…
• ప్రైమరీ ఆసుపత్రులే గగనం అనుకున్న రోజుల నుంచి జిల్లాకో మెడికల్ కాలేజ్ పెట్టుకునే స్థాయికి..
• జాతీయ ఆరోగ్య సూచికల్లో గణనీయ ప్రగతి సాధించిన తెలంగాణ
• 3 అంచెల వైద్యాన్ని 5 అంచెల వ్యవస్థగా విస్తరణ
‘హెల్త్ హబ్’ గా హైదరాబాద్ నగరమునకు అంతర్జాతీయ గుర్తింపు కలిగివున్నది. దేశ విదేశీ ప్రజలు వైద్యసేవలకై హైదరాబాద్ కు వస్తుండటం వలన హెల్త్ టూరిజం విస్తరించింది. గతంలో మూడు అంచెలు- ప్రాధమిక సేవలకు ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ద్వితీయ స్థాయి సేవలకు జిల్లా ఆసుపత్రులు, స్పెషలిటీ సేవలకు మెడికల్ కాలేజీలుగా ఉన్న వైద్య సేవలు వ్యవస్థకు అదనంగా ప్రివేంటివ్ సేవలకు బస్తీ /పల్లె దావఖానలు, సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు టిమ్స్ లతో 5 అంచెలు వ్యవస్థగా మార్చి ప్రజల ముంగిటకే ప్రాధమిక వైద్యాన్ని , పేదలకు అందుబాటులోకి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను తెచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది.
ప్రభుత్వం అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ కార్యక్రమాల అమలుతో జాతీయ ఆరోగ్య సూచికలలో తెలంగాణ రాష్ట్రం గణనీయ ప్రగతి సాధించింది. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల సంఖ్య 98% కు పెరిగింది.
అన్ని ఆరోగ్య సూచికల్లో తెలంగాణ రాష్ట్రం జాతీయ స్థాయి కంటే మెరుగ్గా ఉంది. కేంద్ర ప్రభుత్వమునకు చెందిన ‘‘నీతి ఆయోగ్ ‘‘ విడుదల చేసిన 4 వ ఆరోగ్య సూచిల్లో తెలంగాణ రాష్ట్రం కేరళ, తమిళనాడు తర్వాత 3 వ స్థానానికి చేరింది. తలసరి ప్రభుత్వం చేస్తున్న వైద్యఖర్చుల్లో రూ.1,698 లతో హిమాచల్ ప్రదేశ్, కేరళ తర్వాత తెలంగాణ రాష్ట్రం నిలిచింది. 2022-23 బడ్జెట్లో దానిని రూ.3,091 లకు పెంచారు. అలాగే ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన హెల్త్ ఫిట్నేషన్ కాంపెయిన్ లో 3 కేటగిరిల్లో అవార్డులు ప్రకటించగా తెలంగాణ రాష్ట్రం 3 అవార్డులు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. వైద్య సదుపాయల విస్తరణ, నిరంతర మానిటరింగ్ తో పాటు దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని అమలుచేస్తున్న కుటుంబ సంక్షేమ పథకాలు – కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్, కెసిఆర్కిట్, ఆరోగ్య లక్ష్మి, అమ్మఒడి పథకాల సమ్మిళిత ఫలితాలే జాతీయ స్థాయిలో తెలంగాణ సాధించిన ఆరోగ్య సూచికలుగా పేర్కొనవచ్చు.
గాంధీ ఆసుపత్రిలో అత్యాధునిక సెంట్రల్ డయాగ్నస్టిక్ లేబరేటరీని ఏర్పాటు చేశారు.మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొల్పిన ప్రభుత్వ డయాగ్నస్టిక్ కేంద్రాలలో జరుగుతున్న రోగ నిర్దారణ పరీక్షలను మానిటరింగ్ చేస్తున్నారు. కిడ్నీ వ్యాధిగ్రస్తుల సౌలభ్యం కొరకు 42 డయాలసిస్ కేంద్రాలను ప్రభుత్వం నెలకొల్పింది.
ఒక్కో దానికి రూ.510 కోట్ల వ్యయంతో సంగారెడ్డి, వనపర్తి, నాగర్ కర్నూల్, జగిత్యాల, మహబూబాబాద్, కొత్తగూడెం, మంచిర్యాల, రామగుండం లలో మెడికల్ కాలేజిల ఏర్పాటుచేసింది. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు అయిన తర్వాత యం.బి. బి ఎస్. సీట్లు 5,240 కు, పీజీ మెడికల్ సీట్లు 2,500 లకు, సూపర్ స్పెషాలిటీ సీట్లు 1,000 కు చేరుతాయి.
హైదరాబాద్ నగరవాసులతో పాటు ఆధునిక వైద్య సేవలకొరకు చుట్టు పక్కల జిల్లాల నుంచి వచ్చే వారికి అందుబాటులో వుండే విధంగా ఎయిమ్స్ తరహాలో నగరానికి నాలుగు వైపులా తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్ ) పేరున సూపర్ స్పెషలిటీ ఆసుపత్రులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా 1,500 పడకలతో గచ్చిబౌలి లో టిమ్స్ ఆసుపత్రిని ప్రభుత్వం ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది.మొత్తం రూ.2,679 కోట్ల వ్యయంతో ఒక్కొక్కటి 1,000 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో ఆల్వాల్, గడ్డి అన్నారం, ఎర్రగడ్డలలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఇటీవలనే శంకుస్థాపన చేశారు. వీటిలో 300 ఐసీయు పడకలు ఏర్పాటు చేయనున్నారు. ప్రతి టిమ్స్ ఆసుపత్రిల్లో 26 రకాల ఆపరేషన్ ధియేటర్లు, 30 రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవల విభాగాలు, 16 స్పెషాలిటీ,15 సూపర్ స్పెషాలిటీ పీజీ మెడికల్ కోర్సులు,నర్సింగ్, పారా మెడికల్ కోర్సులు ఏర్పాటు కానున్నాయి. నిమ్స్ ను విస్తరించుటకు, ఇతర టీచింగ్ హాస్పిటల్స్ లో సీట్లు పెంపుకు ప్రభుత్వం కృషి చేస్తున్నది. పట్టణ పేదలకు నాణ్యమైన ప్రభుత్వ వైద్య సేవలను అందించే లక్ష్యంతో గ్రేటర్ హైదరాబాద్ లో 256 బస్తీ దవాఖానలను ప్రభుత్వం నెలకొల్పింది. ప్రాధమిక స్థాయిలో మరింత మెరుగైన వైద్య సేవలను అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా 4,745 సబ్ సెంటర్లను ‘‘పల్లె దవాఖాన’’లుగా అభివృద్ధి చేయుటకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.