అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ: భట్టి విక్రమార్క
హైదరాబాద్: దేశంలోనే తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్లోని ఓ హోటల్లో నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయాధారిత పరిశ్రమలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులకు డిమాండ్ రాబోతోందన్నారు. ప్రతి జిల్లాలో ఆయిల్ పామ్ పండిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు బ్యాంకర్లు సహకరించాలని కోరారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు బ్యాంకులు రుణాలు పెంచాలని తెలిపారు. దశాబ్దాలుగా రైతే రాజు అంటున్నామని, కానీ బ్యాంకు గణాంకాలు చూస్తే భయం వేస్తోందని పేర్కొన్నారు. రైతులకు రుణాలు ఇవ్వడానికి మాత్రం బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయన్నారు. పెద్దలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయం ఉండకూడదని చెప్పారు. నిబంధనల ప్రకారమే బ్యాంకర్లు వ్యవహరించాలని సూచించారు.