Home Page SliderNational

టీమిండియా రోడ్ షో..వాంఖడే స్టేడియంలో తొక్కిసలాట

Share with

టీమిండియా ఇటీవల జరిగిన T20 వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో విజయ కేతనం ఎగురవేసి వరల్డ్ కప్‌ను సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయోత్సాహంతో ఈ రోజు స్వదేశానికి వచ్చిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. అంతేకాకుండా దేశ ప్రధాని మోదీతో కూడా రోహిత్ సేన సమావేశమయ్యింది. ప్రధానితో సమావేశం అనంతరం ముంబయికి చేరుకున్న టీమిండియా ఇవాళ సాయంత్రం నుంచి రోడ్ షోలో పాల్గొననున్నారు. అయితే ఈ రోడ్ షో నారిమన్ పాయింట్ నుంచి ముంబయి వాంఖడే స్టేడియం వరకు జరగనుంది. ఈ నేపథ్యంలో వాంఖడే స్టేడియం వద్దకు దేశం నలువైపుల నుంచి పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు తరలివచ్చారు. దీంతో ప్రస్తుతం వాంఖడే స్టేడియం వద్ద ప్రాంతం క్రికెట్ అభిమానులతో కిక్కిరిసి పోయింది. ఈ క్రమంలో పోలీసులు అభిమానులను స్టేడియం లోపలికి అనుమతించారు. దీంతో అభిమానులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది.అయితే అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండడంతో పోలీసులు వారిని కంట్రోల్ చేయలేకపోతున్నట్లు తెలుస్తోంది.కాగా ముంబయి రైళ్లన్నీ కూడా క్రికెట్ అభిమానుల రాకతో రద్దీగా మారినట్లు సమాచారం. మరోవైపు వాంఖడే స్టేడియం వద్ద ప్రస్తుతం వర్షం పడుతోంది.