తెలుగు రాష్ట్రాలకు తీపికబురు
మండే వేసవి ఎండలతో విసిగిపోయిన తెలుగుప్రజలను చిరుజల్లులు పలకరించబోతున్నాయి. నైరుతి రుతు పవనాలు గుజరాత్లో సంభవించిన భిపోర్జాయ్ తుపాన్ కారణంగా కొన్ని రోజులు నెమ్మదించాయి. చివరకి ఆలస్యంగానైనా వేగం పుంజుకున్నాయి. రాయలసీమలో ప్రవేశించాయి. దీనితో రాయలసీమ, తెలంగాణా, దక్షిణ కోస్తా ఆంధ్రలో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. ఆకాశం మేఘావృతమవుతోంది. 46 నుండి 47 డిగ్రీలతో సెగలు కక్కిన వాతావరణం నెమ్మదిగా 37 డిగ్రీల సెంటీగ్రేడ్కు తగ్గింది. ఈ నెల 22వ తేదీకంతా తెలంగాణాలో కూడా రుతుపవనాలు విస్తరిస్తాయని వాతావరణ శాక తెలియజేసింది. ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం కూడా ఉంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/06/image-129.png)
ఈ రుతుపవనాల కారణంగా తమిళనాడులో కూడా భారీ వర్షాలతో కుంభవృష్టి పడింది. ఆరు జిల్లాలతో పాటు చెన్నై నగరం కూడా తడిసి ముద్దయ్యింది. చెన్నై నగరానికి మంచినీటిని సరఫరా చేసే చెంబరంబాకమ్ అనే జలాశయానికి 921 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. చెన్నై విమానాశ్రయంలో దిగవలసిన 9 విమానాలను కూడా వాతావరణం అనుకూలించక బెంగళూరుకు మళ్లించారు.