Andhra PradeshNewsNews Alert

సుప్రీంకోర్టు సీజేఐ ఎన్.వి రమణకు గౌరవ డాక్టరేట్

Share with

ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలం స్నాతకోత్సవం ఈ నెల 20వ తేదీన జరగనుంది. ఈ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయనున్నారు. ఈ నెల 20న విశ్వవిద్యాలయంలో జరిగే 38, 39వ స్నాతకోత్సవంలో ఆయనకు డాక్టరేట్‌ అందజేస్తామని విశ్వవిద్యాలయం అదనపు ఉపకులపతి ఆచార్య పి.రాజశేఖర్‌ వెల్లడించారు. విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన ఎన్.వి రమణ ను డాక్టరేట్‌తో గౌరవించాలని వర్సిటీ నిర్ణయించగా.. దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కులపతి హోదాలో గవర్నర్‌ నుంచి ఆమోదం లభించిందని తెలిపారు. స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా జస్టిస్‌ ఎన్వీ.రమణను విశ్వవిద్యాలయం ఆహ్వానించింది.

ఎన్.వి రమణకు విశ్వవిద్యాలయం తరఫున గౌరవ డాక్టరేట్‌ ఇవ్వాలని ఈ ఏడాది మార్చి నుంచి పలుమార్లు ప్రయత్నించామని, వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చిందని, ఆ కల ఇప్పుడు నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉందని వీసీ అన్నారు. విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య అభ్యసించిన మొదటి బ్యాచ్‌ విద్యార్థిగా ఆయనకు గౌరవ డాక్టరేట్‌ ఇవ్వడం సముచితమంటూ ఈ అరుదైన అవకాశం విశ్వవిద్యాలయానికి దక్కడంపై ఆచార్య రాజశేఖర్‌ ఆనందం వ్యక్తం చేశారు. ఏఎన్‌యూలో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలోనూ వీసీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి స్నాతకోత్సవ ఏర్పాట్లపై సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి బిస్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్.వి రమణ గౌరవ డాక్టరేట్ ను అందుకోనున్నారు. దీంతోపాటు పీజీ, డిగ్రీ, వృతివిద్య కోర్సుల లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్ధులకు బంగారు పతాకాలు, పిహెచ్ డి, ఎంఫీల్ పరిశోధకులకు డాక్టరేట్ ప్రధానం చేయనున్నారు.