కేరళలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు భారత వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. అదేంటంటే కేరళలోకి నైరుతి రుతు పవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణశాఖ అధికారికంగా ప్రకటించింది. అయితే ఫసిఫిక్ మహసముద్రంలో ఎల్-నినో లాంటి పరిస్థితులు ఏర్పడినా సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది. సాధారణంగా కేరళ,లక్ష్యద్వీప్,కోస్టల్ కర్ణాటకలోని 14 రెయిన్ గేజీలలో ఒకే రోజు 2.5 మి.మీ వర్షపాతం నమోదైతే రుతుపవన వర్షాలు ప్రారంభమైనట్లు ధృవీకరిస్తారు. అయితే ప్రస్తుతం 20 కిలో మీటర్ల వేగంతో నైరుతి గాలులు వీస్తుండడం,సరిపోయే తేమ ఉన్నందున రుతుపవనాల పురోగతిలో అవాంతరాలేవి ఉండకపోవచ్చని IMD తెలిపింది. కాగా ఈ గమనం ఇలాగే కొనసాగితే ఈ నెల 16 నాటికి రాయలసీమ,దక్షిణ కోస్తా, 18 కి తెలంగాణా ,ఉత్తర కోస్తా ఆంధ్ర మొత్తం మేఘాలు ఆవరించి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అరేబియా సముద్రంలో అల్పపీడన వాతావరణం నెలకొనకపోతే రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయని సమాచారం అందించింది. ఈసారి 8 రోజులు ఆలస్యమైనా సెప్టెంబర్ వరకు కొనసాగే వర్ష రుతువులో లోటేమి ఉండదని వాతావరణశాఖ స్పష్టం చేసింది. అయితే ఈ ఏడాది జూన్ 7నాటికి 54% లోటు వర్షపాతం నమోదయ్యినట్లు వాతావరణశాఖ తెలిపింది.