విజయవాడ బస్టాండ్లో గంజాయి కలకలం
ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ స్మగ్లర్లు ఏదో దారిలో మాదక ద్రవ్యాలు రవాణా చేస్తూనే ఉన్నారు. తాజాగా విజయవాడ బస్టాండులో ఒక వ్యక్తి ప్రవర్తనపై అనుమానం వచ్చి అతని సామాగ్రి సోదాలు చేయగా ఏకంగా 15 కిలోల వరకూ గంజాయి లభ్యమయ్యింది. అతడి పేరు తంగరాజు పళని స్వామి అని, చెన్నై బస్సు ఎక్కేందుకు వేచి ఉన్నాడని తెలుసుకున్నారు. అతడు అన్నవరంలో మధ్యవర్తి ద్వారా గంజాయి కొనుగోలు చేసి, చెన్నైలోని వ్యక్తికి రవాణా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడని పోలీసులు తెలియజేశారు. గంజాయి అమ్మిన వ్యక్తి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ పళని స్వామిపై ఎన్డిపిఎస్ చట్టం ప్రకారం పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.