భక్తజన సంద్రమైన సింహాచలం గిరిప్రదక్షణ
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలంలో భక్తుల గిరిప్రదక్షణ కార్యక్రమం ఆదివారం నాడు మొదలయ్యింది. ఆదివారం సాయంత్రం మొదలైన ఈ యాత్రకు అధిక సంఖ్యలో భక్తజనం తరలి వచ్చారు. ఉత్తరాంధ్ర జిల్లాల కొంగుబంగారైన సింహాద్రి అప్పన్న గిరి ప్రదక్షణానికి తెలంగాణా, ఒడిశా రాష్ట్రాల వారు కూడా ఇసుక వేస్తే రాలనంత మంది వచ్చారు. భక్తితో పులకరించిపోతూ, గిరిప్రదక్షణ మొదలుపెట్టారు. గోవింద నామస్మరణ చేస్తూ, దారి పొడుగునా వేల సంఖ్యలో జనం తరలి వెళ్లారు. ఈ రోజు (సోమవారం)ఉదయం సింహాచల పర్వతం దిగువ ప్రాంతమైన పాత గోశాల వద్ద భక్తులు తండోపతండాలుగా గిరిప్రదక్షణ చేస్తున్నారు. ఈ దృశ్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ యాత్ర మూడురోజులపాటు కొనసాగుతుంది.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-4.png)