ఐదు గ్యారంటీలపై అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసిన రేవంత్ రెడ్డి
ప్రజాపాలన అప్లికేషన్ ఫామ్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ఐదు గ్యారెంటీలపై అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారంటీలను పొందడానికి ఈ అప్లికేషన్ను నింపి రేపటి నుండి జనవరి 6 వరకూ దరఖాస్తులు అందజేయవచ్చని పేర్కొన్నారు. దీనిపై ప్రజాపాలన లోగోను కూడా ముద్రించారు. తెలంగాణ సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల లోగో, పోస్టర్, దరఖాస్తులను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు ఇతర మంత్రులు కూడా పాల్గొన్నారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత వంటి ఐదు పథకాలకు గ్రామ సభల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమయ్యిందని, ఆటో డ్రైవర్లను ఆదుకుంటామని తెలియజేశారు. రైతు బంధుకు సంబంధించి ఎలాంటి పరిమితులు విధించలేదని పేర్కొన్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా పథకాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి తెలిపారు.