ఒరిస్సా రైలు ప్రమాద బాధితులకు రిలయన్స్ సంస్థ చేయూత
ఒరిస్సాలోని ఘోర రైలు ప్రమాదం బారిన పడిన బాధితులకు, అక్కడ సహాయసహకారాలు అందిస్తున్న అధికారులకు, సైనికులకు, వాలంటీర్లకు భోజన సదుపాయాలు కలుగ చేస్తోంది రిలయన్స్ ఫౌండేషన్. రాత్రనక, పగలనక కష్టపడి అక్కడ రైల్వే లైను పునరుద్దరించడానికి వేలమంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. బాధితులకు రక్తదానం చేయడానికి స్థానిక యువత బారులు తీరారు. ఈ ప్రమాదంలో 270 మందికి పైగా మరణించగా వేలమంది ఆసుపత్రి పాలయ్యారు. చాలామంది తల్లిదండ్రులను కోల్పోయారు. కొందరు పిల్లలను కోల్పోయారు. ఎందరో అనాథలయ్యారు. మరి కొందరు తీవ్రంగా గాయపడి వికలాంగులయ్యారు. ఈ ప్రమాద బాధితులను ఆదుకుంటామని రిలయెన్స్ ఫౌండేషన్ చైర్ పర్సన్ నీతా అంబానీ ప్రకటించారు. ఈ సహాయానికి సంబంధించిన వీడియోను ట్విటర్లో పోస్ట్ చేశారు. రిలయన్స్ ఫౌండేషన్ మాత్రమే కాకుండా ఒడిశా బాధితులకు అదానీ గ్రూప్ కూడా చేయూతనందించేటందుకు ముందుకొచ్చింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల చదువు బాధ్యతను తమ గ్రూప్ తీసుకుంటుందని ఈ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ట్వీట్ చేశారు.