తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కార్యకర్తల నిరసనలు, ఉద్రిక్తత
తెలంగాణ బీజేపీ కార్యాలయంలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్కు వ్యతిరేకంగా కార్యకర్తల నిరసనలు వెల్లువెత్తాయి. అర్వింద్ ఎవరినీ సంప్రదించకుండా 13 మండలాల అధ్యక్షులను మార్చారని ఆరోపిస్తూ ఆర్మూర్,బాల్కొండ, బోధన్ మండలాల కార్యకర్తలు కార్యాలయంలో భైఠాయించి, నినాదాలు చేశారు. సొంత పార్టీ కార్యకర్తలకే అర్వింద్ అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మార్చిన మండల అధ్యక్షులను తిరిగి నియమించాలంటూ నినాదాలు చేశారు. చివరకు పార్టీ నేతలు వారితో మాట్లాడి, కిషన్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఉద్రిక్తతలు చల్లబడ్డాయి.