ప్రవళిక హత్యకేసు నిందితుడు శివరాంకు బెయిల్..
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రవళిక హత్యకేసు నిందితుడు శివరాం రాథోడ్కు నాంపల్లి కోర్టులో బెయిల్ మంజూరయ్యింది. అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నేడు గాంధీ ఆసుపత్రిలో వైద్యపరీక్షలు జరిపి నిందితుడిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో ఈ ఆత్మహత్యలో శివరాం పాత్ర ఉందని చెప్పడానికి కోర్టులో పోలీసుల సరైన ఆధారాలు చూపలేకపోయారు. దీనితో కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసుతో తనకేం సంబంధం లేదని, ప్రవళిక ఆత్మహత్యకు, తనకు సంబంధం లేదని, తప్పు చేయలేదు కాబట్టే తప్పించుకోలేదని శివరాం వాదించారు. తన అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదంటూ అతని సోదరుడు మునిరాం రాథోడ్ కూడా తెలిపాడు. తమ కుటుంబానికి పోలీసుల వేదింపులు ఎక్కువయ్యాయని ఆరోపించారు. ప్రవళిక సూసైడ్ నోటులో ఎక్కడా శివరాం ప్రస్తావన లేదు. అయితే శివరాం వేదింపుల వల్లే తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని, ఆమె తల్లి, సోదరుడు మీడియాకు తెలిపారు. శివరాంకు శిక్ష పడేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయంపై మంత్రి కేటీఆర్ స్పందించి, ఆమె కుటుంబానికి అండగా ఉంటామని, సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.