మన ఇంటికే పోస్టాఫీస్.. తపాలా శాఖ వినూత్న పథకం
స్పీడ్ పోస్ట్, రిజిస్టర్ లెటర్లు, పార్సిళ్లు వంటివేవైనా పోస్టులో ఇతర ప్రదేశాలకు పంపాలంటే ఇకపై మేమే మీ ఇంటికి వచ్చి తీసుకెళ్తాం.. ఇంటికే పోస్టాఫీస్ అనే వినూత్న పథకాన్ని ప్రవేశపెట్టింది తపాలా శాఖ. ఎప్పటికప్పుడు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ సరికొత్త సేవలను అందుబాటులోకి తెస్తోంది. దీనికి క్లిక్ ఎన్ బుక్ అని నామకరణం చేశారు. హైదరాబాద్లోని 107 పిన్కోడ్ పరిధిలో ఈ సేవలు అందుబాటులోకి తెచ్చామని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డి తెలిపారు. 5 కేజీల వరకూ పార్సిళ్లను బుక్ చేసుకోవచ్చు. రూ. 500 కంటే ఎక్కువ చార్జీలుంటే ఉచితంగా తీసుకెళ్తామని, లేదంటే పార్సిల్ బుక్ చేసినందుకు రూ. 50 వసూలు చేస్తామని తెలిపారు. www.indiapost.gov.in\vas\pages\indiaposthome.aspx తపాలా శాఖ వెబ్సైట్లోకి వెళ్లి ఈ సేవలను బుక్ చేసుకోవచ్చు. అయితే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ ఈ సేవలను వినియోగించుకోవచ్చని, సెలవుల్లో ఈ సేవలుండవని తపాలా శాఖ తెలిపింది.