పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ప్యాకేజీ స్టారే: వైసీపీ మంత్రి
ఏపీ రాజకీయాలు రోజు రోజుకి రసవత్తరంగా మారుతున్నాయి. కాగా వచ్చే ఏడాదిలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార,ప్రతిపక్షాలు ఒకరుపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా ఏపీ వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్ జనసేన పార్టీపై మరోసారి విమర్శలు గుప్పించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు ఓ పెయిడ్ ఆర్టిస్ట్,ప్యాకేజీని బట్టి ఆయన పాత్ర ఉంటుందని ఆరోపించారు. అంతేకాకుండా ఏపీలో జనసేన పార్టీ పోటీ చేయడానికి కనీసం అభ్యర్థులు కూడా లేరని మంత్రి ఆదిమూలపు సురేష్ ఎద్దేవా చేశారు. ఏపీలో టీడీపీ ,జనసేన పార్టీలు పొత్తులు పెట్టుకుంటూ కుట్రలు,కుతంత్రాలు పన్నుతున్నాయని ఆయన మండిపడ్డారు. ఏపీలో వాళ్లు ఏం చేయాలనేది వచ్చే ఎన్నికల్లో ప్రజలే నిర్ణయిస్తారన్నారు.అయితే జనసేన పార్టీపై వచ్చే విమర్శలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలపై ఎలా కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సివుంది.