NationalNews

 ప్రధాని మోదీకీ పవన్‌కళ్యాణ్ లేఖ

Share with

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రోజు ప్రధాని మోదీకీ లేఖ రాశారు.  ఈ లేఖలో ఆయన మందుగా ప్రధాని మోదీ ప్రారంభించిన కర్తవ్య పథ్ గురించి ప్రస్తావించారు. కర్తవ్య పథ్ అనేది భారతీయత ఉట్టిపడే నామాధేయమని సంభోదించారు. ఇది బ్రిటీష్ కాలంలో కింగ్స్‌ వే..ఆ తరువాత రాజ్ పథ్‌గా మారి ఇప్పుడు కర్తవ్య పథ్‌గా అవతరించిదన్నారు.

దేశంలో బ్రిటీష్ రాచరిక పాలన అంతరించి 75 సంవత్సరాలు గడిచిందన్నారు. అయితే వారి వలసవాద పాలనకు ఇంకా మానని గాయాలుగా మిగిలిన సజీవ గుర్తులను తుడిచివేస్తున్న గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనీయులని ప్రశంసించారు. అంతేకాకుండా 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ సంకల్పంతో వలసవాద పాలనలో ఉద్భవించిన పేర్లు , చిహ్నాలను తొలగించాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారన్నారు.ఈ విధంగా ఆ వాగ్దానాన్ని అమలు చేయడం హర్షనీయమన్నారు.

న్యూఢిల్లీలోని ప్రధాని అధికారిక నివాసం ఉండే వీధిని బ్రిటీషు వారు రేస్ కోర్స్‌గా పిలిచేవారని చెప్పారు. అయితే ఇప్పుడు ప్రధాని మోదీ దానికి లోక్ కళ్యాణ్‌గా నామకరణం చేశారన్నారు. అదే విధంగా భారతీయ వాయుసేన పతాకంలో సెయంట్ జార్జ్ క్రాస్ ఉండేది. దాని స్థానంలో నూతన పతాకాన్ని మోదీ గారు ఆవిష్కరించారన్నారు. మోదీ గారు చేపట్టిన ఈ గుణాత్మక చర్యలు బానిసవాదాన్ని నిర్మూలించే అభ్యుదయ చర్యలుగా భావిస్తున్నానన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ గారికి పవన్‌కళ్యాణ్ తన విన్నపాన్ని తెలియజేశారు.

కర్తవ్య పథ్‌లో సమరయోధుడు శ్రీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ మహా వీరుని పట్ల మీకున్న భక్తి భావాన్ని చాటుకున్నారన్నారు. మీ చేతుల మీదుగానే జపాన్‌లో భద్రపరచిన శ్రీ నేతాజీ అస్థికలను కూడా రప్పించవలసిందిగా కోరుతున్నానన్నారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్  గారి మనువరాలు రాజశ్రీ చౌదరీ బోస్ గారి అనుమతితో ఆమె డి.ఎన్.ఏ తో వాటిని సరిపోల్చాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నానన్నారు. ఇది సాకారమైతే ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లక్ష్యం సిద్దిస్తుందన్నారు. భారత జాతి విముక్తి కోసం పోరాడిన ఆ మహనీయునికి నివాళిగా మిగిలిపోతుందని భావిస్తున్నట్లు లేఖలో పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.