సూర్యాపేట ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్
సూర్యాపేట జిల్లా పోరాటాలకు పుట్టినిల్లు.. ఇక్కడి ప్రజలు ఎంతో చైతన్యవంతులు.. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచిన బీజేపీ, జనసేన అభ్యర్థులను గెలిపించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కేసీ గుప్తా సెంటర్లో గురువారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు. బీసీల కోసం పనిచేసే బీజేపీ అభ్యర్థుల గెలుపుకోసం కార్యకర్తలు, అభిమానులు శక్తివంచన లేకుండా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రోడ్ షోకు వచ్చిన జనాన్ని చూస్తే బీజేపీ, జనసేన అభ్యర్థుల గెలుపు ఖాయమనిపిస్తోందని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 30న జరగనున్న పోలింగ్లో ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపిస్తే మళ్లీ ఇదేచోట కలుస్తానని చెప్పారు. తెలంగాణ తల్లికి జేజేలు పలుకుతూ పవన్ కళ్యాణ్ తన ప్రసంగాన్ని ముగించారు. పవన్ కళ్యాణ్ రోడ్ షో గంటపాటు సాగింది.