అవాస్తవాలను ప్రచారం చేయడంలో తండ్రిని మించిన వ్యక్తి నారా లోకేష్
వాస్తవాలను వక్రీకరించి.. అవాస్తవాలను ప్రచారం చేయడంతో టీడీపీ నాయకుడు నారా లోకేష్ తండ్రిని మించిపోతున్నారని వైసీపీ రాజ్యసభ సభ్యులు ఎద్దేవా చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో గురువారం నారా లోకేష్ ‘జయహో బీసీ’ సదస్సు పెట్టి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నాలు చేశారని వైసీపీ ఎంపీలు దుయ్యబట్టారు. ఈ సందర్బంగా దేశ రాజధాని ఢిల్లీలో రాజ్యసభ సభ్యులు ఎంపీ మోపిదేవి వెంకట రమణా రావు, పిల్లి సుభాష్, బీదా మస్తాన్ రావు, సత్యవతి, బి. చంద్రశేఖర్ లు కలిసి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. వైఎస్సార్ సీపీని లక్ష్యంగా చేసుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తున్న నారా లోకేష్, టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఎంపీలు ఖండించారు. ఆంధ్రప్రదేశ్లో బీసీ సామాజిక వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా ప్రాధాన్యం ఇచ్చిన ఘనత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందని వైసీపీ రాజ్యసభ సభ్యులు తెలిపారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-150.png)
రేపల్లెలో జరిగిన ఓ సంఘటనను అడ్డంపెట్టుకుని లోకేష్ రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. రేపల్లెకు చెందిన అమర్నాథ్ అనే బిడ్డ చనిపోతే.. అతని కుటుంబాన్ని ఆదుకున్నది సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.10లక్షలు ప్రభుత్వ సాయం, ఒక రూ.లక్ష వ్యక్తిగత సాయంతోపాటు.. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇల్ల స్థలం, ఇల్లు కట్టించి ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుందన్నారు. బాధిత కుటుంబంలోని ఆ చిన్నపిల్లను రెచ్చగొట్టి ఏవేవో మాట్లాడించాలని లోకేష్ ప్రయత్నించడం సిగ్గుచేటని ఎంపీ మోపిదేవి అన్నారు. ఇక టీడీపీ హయాంలో రిషికేశ్వరి అనే అమ్మాయి ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో చనిపోతే కనీసం చంద్రబాబు, లోకేష్ ఎవరూ పరామర్శించిన పాపానపోలేదన్నారు. మరి ఆ రోజు లోకేష్ ఎక్కడ నిద్రపోతున్నాడో చెప్పాలని ఎంపీ మోపిదేవి డిమాండ్ చేశారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-146.png)
2014 నుంచి 2019 మధ్య కాలంలో టీడీపీ హయాంలో బీసీల సాధికారత, వారు ఆర్థికంగా సామాజికంగా, రాజకీయంగా ఎదగడానికి ఏం చేశారో చెప్పాలని ఎంపీ మోపిదేవి డిమాండ్ చేశారు. బీసీలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా కూడా ఎదిగేందుకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంతో ప్రాధాన్యం కల్పించారని ఎంపీ తెలిపారు. రాష్ట్రంలో బీసీ కమిషన్ ఏర్పాటు చేయడం, అసెంబ్లీ స్పీకర్ బీసీకి కేటాయించడం, కేబినెట్లో దాదాపు 11 మంది బీసీలు మంత్రులుగా ఉన్నారని, రాజ్యసభకు బీసీలను ఏనాడు టీడీపీ ఒక్కరిని కూడా పంపిన సందర్భాలు లేవని, అలాంటిది సీఎం జగన్ నలుగురిని రాజ్యసభకు పంపారన్నారు. లోక్సభలో ఆరుగురు బీసీలు ఎంపీలుగా ఉన్నారని, ఇక 31 మంది ఎమ్మెల్యేలు, 12 మంది ఎమ్మెల్సీలు, 56 బీసీ కార్పొరేషన్ ఛైర్మన్లు, 9 మంది జడ్పీ ఛైర్మన్లు, 9 మంది మేయర్లు, 215 మంది జడ్పీటీసీలు బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారంటే ఈ సామాజిక వర్గాలపై సీఎం జగన్కు ఎంత ప్రేమ ఉందో తెలుస్తుందన్నారు. బీసీల అభ్యున్నతికి గత టీడీపీ హయాంలో బడ్జెట్లో 16వేల కోట్లు కేటాయిస్తే.. 82 వేల కోట్లు వైసీపీ హయాంలో కేటాయించామన్నారు.
![](https://www.manasarkar.com/wp-content/uploads/2023/07/image-149.png)
సీఎం జగన్ మోహన్ రెడ్డిని ధైర్యంగా ఎదుర్కోలేక, కులాలను తీసుకొచ్చి, వారిని రెచ్చగొట్టి నీచ రాజకీలు చేయాలని టీడీపీ నాయకుడు నారా లోకేష్ భావిస్తున్నాడని ఎంపీ బీదా మస్తాన్ రావు తెలిపారు. అధికారం కోసమే చంద్రబాబు, అతని కొడుకు నారా లోకేష్ బీసీల భజన చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. యువగళం పేరుతో అబద్దాలను ప్రచారం చేస్తున్నారన్నారు. బీసీలంటే వెనుకబడిన తరగతలు కాదని.. సమాజానికి వెన్నెముక వంటి వారని సీఎం జగన్ భావిస్తున్నారు. అనేక సంక్షేమ పథకాలను బీసీల కోసం సీఎం జగన్ తీసుకొస్తున్నారని ఎంపీ పేర్కొన్నారు.