మహనాడు కేవలం చిన్న టీజర్ మాత్రమే: ధూళిపాళ్ల
ఏపీలో ఇటీవల టీడీపీ మహనాడు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కాగా టీడీపీ నేతలు ఊహించిన దానికంటే ఎక్కువగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మహనాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో టీడీపీ మహనాడు జనసంద్రాన్ని తలపించింది. అయితే ఈ మహనాడు కార్యక్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ మినీ ఫెస్టోను విడుదల చేశారు. దీనిపై అధికార పక్ష ఎమ్మెల్యేలు,ఎంపీలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలను టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తిప్పికొట్టారు. ఆయన మాట్లాడుతూ..మహనాడులో చంద్రబాబు ప్రకటించిన టీడీపీ మ్యానిఫెస్టో చిన్న టీజర్ మాత్రమే అన్నారు. దసరాకు అసలు సినిమా ఉందని ధూళిపాళ్ల వ్యాఖ్యానించారు. అయితే టీడీపీ మ్యానిఫెస్టో విడుదలైనప్పటి నుంచి 15 మంది మంత్రులు మ్యానిఫెస్టోపై విమర్శలు చేశారన్నారు. ఏపీలో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న టీడీపీని చూసి వైసీపీ భయపడుతుంటే విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీ మంత్రులంతా శాఖలను గాలికి వదిలేసి,దోపిడి పైనే దృష్టి పెట్టినట్లు కన్పిస్తోందని నరేంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.