అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత స్పందించిన కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత తొలిసారి స్పందించారు. సోమవారం సాయంత్రం ఎర్రవల్లిలోని తన ఫామ్హౌస్లో గెలిచిన ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయ్యారు. ఈ భేటీలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
గెలిచిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు, వచ్చే నెల 16వ తేదీ దాకా మన ప్రభుత్వం కొనసాగేందుకు అవకాశం ఉంది (తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి గడువు జనవరి 16వ తేదీ దాకా ఉంది) కానీ, ప్రజల తీర్పుతో హుందాగా తప్పుకున్నాం. కొత్త ప్రభుత్వానికి సహకరిద్దాం.. ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నట్లు తెలుస్తోంది. త్వరలో జరుపబోయే మీటింగ్లో బీఆర్ఎస్ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుందాం అని ఆయన ఎమ్మెల్యేలతో అన్నారు. సీఎం కేసీఆర్ను కలిసిన వాళ్లలో నెగ్గిన ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు, పలువురు సీనియర్లు ఉన్నారు.