Home Page SliderTelangana

కేసీఆర్‌కు అధికారకాంక్ష తప్ప, అభివృద్ధి ధ్యాస లేదు -కిషన్ రెడ్డి

Share with

మోసపూరిత హామీలతో రెండుసార్లు అధికారంలోకి వచ్చినా కూడా మళ్లీ అధికార కాంక్షే తప్ప, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస కల్వకుంట్ల కుటుంబానికి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తాను తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం చేస్తున్న సహకారాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని కోరుతూనే సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తున్నానని తెలియజేశారు. ఆడవుల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వ వాటాను కేటాయించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ వ్రాసిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు కిషన్ రెడ్డి.  “కాంపెన్ సేటరీ అఫారెస్టేషన్ ఫండ్” కింద కేంద్రప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు.

ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి వస్తే.. కలిసేందుకు ముఖ్యమంత్రికి తీరిక లేదని, మహారాష్ట్రలో బీఆర్ఎస్ విస్తరించాలన్న ఆకాంక్షతో గాలిలో దీపం పెట్టినట్లు.. అక్కడ మీటింగ్ లు పెడుతున్నారన్నారు. భద్రాచలంలో శ్రీరామ కల్యాణోత్సవానికి హాజరై ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు సమర్పించేందుకు తీరికలేని కేసీఆర్ కు.. రంజాన్ సందర్భంగా వేషాలు మార్చుకుంటూ ఇఫ్తార్ విందుల్లో పాల్గొనేందుకు సమయం దొరుకుతోందని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో రాష్ట్ర పురోగతి కోసం చేపడుతున్న కార్యక్రమాలను, రాష్ట్రంలో అమలు చేసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని కోరుతూ తన లేఖల పర్వం కొనసాగుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ కు ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం రాష్ట్రం అభివృద్ధి చెందాలని లేదని అన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం మాత్రమే కేసీఆర్ కు తెలుసని, కేంద్రం అందించే సహకారాన్ని అందిపుచ్చుకునే ఆలోచన ఎంతమాత్రమూ లేదన్నారు.