మరో కొత్త ‘పథకం’తో జగన్ సర్కార్
•’జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంకు అనుబంధంగా ‘జగనన్న సురక్ష పథకం’
• 23 వ తేదీ నుండి నెలరోజుల అమలు
• 26 జిల్లాలకు ప్రత్యేక అధికారుల నియామకం
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మరో సరికొత్త పథకం ‘జగనన్న సురక్ష’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంకు అనుబంధంగా ఉంటుంది. ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు లబ్ధి పొందటానికి అర్హతలు ఉన్నప్పటికీ చాలామందికి అందటం లేదు. అలాంటి వారి వివరాలు సేకరించి ఆగస్టు ఒకటో తేదీ నుంచి వారికి వర్తించే పథకాలను అందించడమే ఈ పథకం లక్ష్యం. ఇప్పటికే అమలవుతున్న జగనన్నకు చెబుదాం కార్యక్రమానికి ఇది అనుబంధం. ఈ మేరకు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం, ‘గడప గడపకూ మన ప్రభుత్వం’, ఉపాధి హామీ పనులు, హౌసింగ్, వ్యవసాయం, సాగునీటి విడుదల, జగనన్న భూహక్కు తదితర అంశాలపై సమీక్షించారు.
ఈనెల 23 నుంచి జులై 23 వరకూ జగనన్న సురక్ష కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. పత్రాలు, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏమైనా సమస్యలుంటే తక్షణమే వాటిని పరిష్కరిస్తారు. డాక్యుమెంటేషన్, సర్టిఫికెట్లు, ప్రభుత్వ పథకాలు, అర్హతలు తదితర వాటికి సంబంధించి మండలాధికారులు క్యాంపులు నిర్వహిస్తారు. గ్రీవెన్స్ను రిజెక్ట్ చేస్తే సంబంధిత ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లి.. ఎందుకు రిజెక్షన్కు గురైందో వారికి వివరించాలన్నారు. పరిశీలించని గ్రీవెన్సెస్ ఏమైనా ఉంటే 24 గంటల్లోగా వాటిని పరిష్కరించాలని సూచించారు. ఉపాధి హామీ కింద ఈ ఏడాదిలో 24 కోట్ల పనిదినాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.రాష్ట్రంలో ఇప్పటివరకూ సుమారు 3.9 లక్షల ఇళ్లు పూర్తయ్యాయినట్లు సీఎం చెప్పారు. జులై 8 నుంచి సీఆర్డీఏ ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని సూచించారు ముఖ్యమంత్రి. సచివాలయాల స్థాయిలోనే అన్నిరకాల సేవలు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలన్నారు.