ఆపిల్ ఆరెంజ్ ఒకటేనా? బాల్కిస్ బనో కేసును దేనితో పోల్చలేమన్న సుప్రీంకోర్టు
. K M జోసెఫ్, B V నాగరత్నలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈరోజు బాల్కిస్ బనో కేసుపై వ్యాఖ్యానించింది. సమూహాన్ని హత్యచేసిన వారిని, ఒక మనిషిని హత్యచేసిన కేసుతో ఎలా పోలుస్తారని గుజరాత్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది సాధారణంగా సెక్షన్ 302 హత్యలకు ఇచ్చే తీర్పు కాదని స్పష్టం చేసింది. 2002లో జరిగిన గోద్రా అల్లర్లలో అత్యాచారంతో పాటు హత్య కావించబడిన ఒక నిండు గర్భిణి, ఆమె కుటుంబసభ్యుల హత్యలను ఒక సాధారణ హత్యకేసుతో పోల్చడం సరికాదని వ్యాఖ్యానించింది. గుజరాత్ ప్రభుత్వం 11 మంది నిందితులను ఎలా విడుదల చేసారని ప్రశ్నించింది. ఆపిల్, ఆరెంజ్ ఒకటి కాదని అలాగే సమూహాలను హత్య చేయడం, ఒకరిని హత్య చేయడం ఒకటే కాదని పేర్కొంది. ఇది చాలా ప్రమాదకరమైన విషయమని, నీచమైన నేరాలు, సమాజానికి వ్యతిరేకంగా చేసే ఘోరాలు ఉపేక్షింపబడకూడదని వివరించారు. గతంలో జీవితఖైదు పడిన ఈ 11 మంది ఖైదీలను విడుదల చేయడానికి గుజరాత్ ప్రభుత్వం అంగీకరించింది. దీనితో దేశవ్యాప్తంగా విమర్శలు, ఆందోళనలు చెలరేగాయి. ఈ కేసుపై తుది విచారణను మే 2వతేదీకి వాయిదా వేసింది. నిందితులు వారి సమాధానాలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.