అంతర్జాతీయ వేదికపై భారతీయ చిన్నారి..శిలాజ ఇంధన వినియోగంపై నిరసన
ఆటలాడుతూ చదువుకునే 12 ఏళ్ల వయస్సులో లిసిప్రియా అనే భారతీయ చిన్నారి శిలాజ ఇంధనాల వాడకాన్ని వ్యతిరేకిస్తూ కాప్-28 ప్రపంచ వాతావరణ సదస్సులో గళమెత్తింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని దుబాయ్లో జరుగుతున్న ఈ సమావేశంలో ఐక్యరాజ్యసమితికి చెందిన ఉన్నత స్థాయి సమావేశం జరుగుతోంది. హఠాత్తుగా వేదికపైకి వచ్చిన మణిపుర్కు చెందిన లిసిప్రియా కంగుజం అనే బాలిక శిలాజ ఇంధనాలకు ముగింపు పలకండి, భూమిని కాపాడి, భవిష్యత్తును రక్షించండి అనే ప్లకార్డును ప్రదర్శించింది. వీక్షక్షుల మధ్యనుండి శరవేగంగా వేదికపైకి వెళ్లి, ప్లకార్డును ప్రదర్శించి, ప్రసంగించడం మొదలు పెట్టింది. అయితే సిబ్బంది ఆమెకు నచ్చచెప్పి కిందకు పంపించారు. అయితే ఆమె ప్రసంగానికి కాప్ డైరక్టర్ జనరల్ మజిద్ అల్ సువైదీ స్పందించారు. చిన్నారి ఉత్సాహం, ధైర్యం చూసి, ఆశ్చర్యపోయానంటూ పేర్కొన్నారు. అనంతరం లిసిప్రియా ట్వీట్ చేస్తూ శిలాజ ఇంధనాలు వాడకూడదని, తనకు మద్దతు ఇవ్వమంటూ ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ను ట్యాగ్ చేసింది. ఐరాస వద్ద తన గళాన్ని వినిపించే అవకాశం ఇమ్మని, బాలల హక్కుల ఉల్లంఘన ఐరాస ప్రాంగణంలోనే జరిగిందని ఆమె పేర్కొంది.