పాక్ మూలాలున్నా.. హృదయాలను గెలుచుకున్నాడు
జింబాబ్వే స్టార్ ఆటగాడు సికిందర్ రజా ఇప్పుడు నయా సంచలనం. జట్టులో ఎవరు ఆడినా.. ఆడకపోయినా తాను మాత్రం చెలరేగుతూనే ఉన్నాడు. బంగ్లాదేశ్తో జరిగిన సిరీస్లో సికిందర్ రజా వరుస శతకాలతో అలరించాడు. భారత్తో మాత్రం అదే ఫామ్ను కొనసాగించడంలో విఫలమయ్యాడని అనుకునేలోపే చివరి వన్డే మ్యాచ్లో అద్భుత సెంచరీతో మెరిశాడు. భారత్పై జింబాబ్వే మ్యాచ్ ఓడినా.. సికిందర్ రజా మాత్రం అభిమానుల మనసు దోచుకున్నాడు. పాక్ మూలాలున్న బ్యాటర్ అయినప్పటికి సికిందర్ రజాపై భారత్ అభిమానులు సోషల్ మీడియాలో ప్రేమ వర్షం కురిపిస్తున్నారు.
వన్డే సిరీస్ ప్రారంభానికి ముందే సికిందర్ రజా తనతో జాగ్రత్తగా ఉండాలని భారత బౌలర్లను హెచ్చరించాడు. అయితే తొలి రెండు వన్డేల్లో అతన్ని తొందరగా ఔట్ చేయడంలో సఫలమైన భారత బౌలర్లు మూడో వన్డేలో మాత్రం రజా బ్యాటింగ్ పవర్ను రుచి చూశారు. 167 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో ఉన్న జట్టును సికిందర్ రజా నడిపించిన తీరు అద్భుతమనే చెప్పాలి. ఇన్నింగ్స్ నిర్మించడమే అనుకుంటే ఏకంగా 115 పరుగుల సెంచరీలో 9 ఫోర్లు, 3 సిక్సర్లులతో చెలరేగి భారత బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. ఒక దశలో జింబాబ్వేను విజయం దిశగా నడిపించిన సికిందర్ రజా.. భారత్ సిరీస్ను క్లీన్స్వీప్ చేయకుండా అడ్డుపడేలా కనిపించాడు. అయితే చివర్లో ఒత్తిడిని అధిగమించలేక జింబాబ్వే 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
ఇక సికిందర్ రజా తన కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్ కనబరుస్తున్నాడు. వన్డే క్రికెట్లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. గత ఆరు వన్డే మ్యాచ్ల్లో మూడు సెంచరీలు చేయడం విశేషం. పాకిస్తాన్లోని సియాల్కోట్లో 1986లో జన్మించిన సికిందర్ రజా.. 2002లో కుటుంబంతో జింబాబ్వేలో స్థిరపడ్డాడు. 2013 మేలో అఫ్గనిస్తాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. 2013 సెప్టెంబర్ 3న పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లో అరంగేట్రం చేసిన సికిందర్ రజా..ఇప్పటివరకు జింబాబ్వే తరపున 115 వన్డేల్లో 3366 పరుగులు, 17 టెస్టుల్లో 1187 పరుగులు, 50 టి20ల్లో 685 పరుగులు సాధించాడు.