ఉచిత పథకాల విషయంలో “సొమ్ము ఒకడిది..సోకు ఒకడిది”
ప్రస్తుతం మన దేశంలో ఎన్నికలు ప్రారంభం అయ్యాయంటే రాజకీయ నేతలంతా ఉచిత పథకాలను ఓటర్లకు ఎరగా చూపుతున్నారు. అయితే దీనిపై కేంద్ర విద్యుత్ శాఖమంత్రి ఆర్కే సింగ్ మండిపడ్డారు. ఓట్ల కోసం రాజకీయ నాయకులు ఉచిత పథకాలు ప్రకటిస్తున్నారని ఆయన విమర్శించారు. కాగా ఈ ఉచిత పథకాల ఖర్చును భరించేది పన్ను చెల్లింపు దారులు అన్నారు. అయితే రాజకీయ నాయకులు మాత్రం ఉచిత పథకాల ఖర్చును తాము చెల్లిస్తున్నట్లుగా పేరు సంపాదిస్తున్నారన్నారు. ఢిల్లీలో తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ..ఎన్నికల సమయంలో మా పార్టీకి ఓటు వేస్తే ఉచిత విద్యుత్ అంటూ నేతలు ప్రకటిస్తారు. కానీ ఆ మొత్తాలను చెల్లించకపోవడంతో డిస్కంలు భారీ నష్టాల్లో కూరుకుపోతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా దేశంలోని పలు రాష్ట్రాల రాజకీయ నేతలు ఉచిత పథకాల విషయంలో “సొమ్ము ఒకడిది..సోకు ఒకడిది” అన్న చందంగా వ్యవహరిస్తున్నారని కేంద్ర మంత్రి ఆర్కే సింగ్ దుయ్యబట్టారు.