వరద పాలయిన 2 కోట్ల విలువ చేసే బంగారం
కర్ణాటక రాజధాని బెంగళూరులో వరద పోటెత్తుతోంది. భారీ ఆస్థినష్టం వాటిల్లుతోంది. గత కొన్ని రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలు నగర వాసులకు కష్టాలు తెచ్చిపెట్టాయి. తాజాగా మల్లేశ్వరంలోని తన దుకాణంలోని 2 కోట్ల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు వరదలో కొట్టుకుపోయాయని ఒక బంగారు వర్తకుడు నెత్తీ, నోరూ కొట్టుకున్నాడు. తన దుకాణంలోకి ఆకస్మికంగా వరదనీరు చేరిందని, దీనికి దగ్గరలో జరుగుతున్న నిర్మాణపనులే కారణమని ఆరోపించారు. చెత్తాచెదారంతో వరద నీరు ఒక్కసారిగా షాపులోనికి ప్రవేశించడంతో షటర్లు మూసే సమయం కూడా లేకపోయిందని తెలిపాడు. వెంటనే మున్సిపల్ అధికారులకు ఫోన్ చేసి, సహాయం కోరినా ఎవరూ రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అకాల వర్షాల కారణంగా కాలువలు పొంగిపొర్లుతున్నాయి. రహదారులలో విపరీతమైన చెత్త పేరుకుపోయింది. చెట్లు కూలిపోయాయి. ఆదివారం నాడు కేఆర్ సర్కిల్ వద్ద అన్డర్ గ్రౌండ్ డ్రైనేజ్ పొంగి ఏపీకి చెందిన భానురేఖ మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకూ ఈ వరదల కారణంగా ఆరుగురు మరణించినట్లు సమాచారం.