ఎన్నికల అనంతరం ‘గాడ్సే రేవంత్ రెడ్డి’ బీజేపీలో చేరడం ఖాయం…కేటీఆర్
తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న పనికిమాలిన ఆరు హామీలను పట్టించుకోవద్దన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్కు అధికారమిస్తే అంధకారమేనని, ఎన్నికల అనంతరం గాడ్సే లాంటి రేవంత్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఎన్నడో చచ్చిన పీనుగ లాంటి పార్టీ అని, ఏవైనా హామీలు ఇస్తే ఒకటో రెండో ఓట్లు వస్తాయన్న ఆశతో ప్రజలను మభ్యపెడుతోందని కేటీఆర్ పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇస్తున్న హామీలకు మించి వాటి బాబు, తాతల్లాంటి మేనిఫెస్టోని ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని, త్వరలోనే ప్రకటిస్తారని కేటీఆర్ తెలియజేశారు. నేడు షాద్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లబ్దిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ, ప్రభుత్వం ఏ పార్టీకి బీ -టీమ్ కాదని, తాము తెలంగాణ ప్రజల ఏ- టీమ్ అని వ్యాఖ్యానించారు. ప్రజా ఆశీస్సులున్నంత వరకూ తమకు ఎలాంటి ప్రమాదం లేదని తెలంగాణను సమున్నతంగా నిలబెట్టడమే తమ ధ్యేయమన్నారు.