హరిద్వార్లో ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్న గంగానది
ఉత్తరాఖండ్లోని గంగానది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలకు పొంగి, పొరలుతూ హరిద్వార్ వద్ద ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తోంది. ఓ పక్క ఢిల్లీలో యమునానది ఇంకా శాంతించనే లేదు. ఈలోపే గంగానది కూడా ప్రమాదస్థాయిని దాటడంతో అక్కడి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రహదారిలో బండరాళ్లు దొర్లి పడుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతూ ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. బద్రినాథ్లోని అలకనంద నదిపై గల జీవీకే హైడ్రో ఎలక్ట్రిక్ డ్యామ్ నిండడంతో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీనితో దేవప్రయాగ్, హరిద్వార్ ప్రాంతాలలో గంగమ్మ 293 మీటర్లు దాటి మహోగ్ర రూపాన్ని దాల్చింది. నది పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్తగా కాళీ చేయిస్తున్నారు అధికారులు. హరిద్వార్, రూర్కీ, భగవాన్ పుర్, లస్కర్ వంటి ప్రాంతాలలోని గ్రామాలలో వరదనీరు చేరుతోంది.