గజ్వేల్ బీజేపీ కార్యకర్తల ఆత్మీయసమ్మేళనంలో ఈటల
బీజేపీ కార్యకర్తలు గజ్వేల్లో ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేశారు. దీనిలో బీజేపీ ముఖ్యనేత ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ, ఎన్నికలలో గెలుపోటములు ముఖ్యం కాదని, అంతకంటే విలువైన 3 వేల మంది కార్యకర్తలు కొత్తగా బీజేపీలో చేరారన్నారు. తెలంగాణలో 2014 నుండి నెమ్మదిగా ఎన్నికలలో ఒక్కొక్క నియోజకవర్గంలో గెలుచుకుంటూ వచ్చిందన్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాలలో పర్యటించిన ఆయన ప్రతీచోటా తనకెదురైన అనుభవాలను కార్యకర్తలతో పంచుకున్నారు. ప్రతీ చోటా రాష్ట్రఎన్నికలు, కేంద్రఎన్నికలు వేరనే ప్రజాభిప్రాయమే వచ్చిందన్నారు. పార్టీతో,వ్యక్తులతో సంబంధం లేకుండా దేశభక్తి ఉన్న ఓటర్లందరూ ప్రధాని మోదీనే మళ్లీ ప్రధాని కావాలనుకుంటున్నారని పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికలలో తప్పకుండా బీజేపీ విజయం సాధిస్తుందని, తెలంగాణ నుండి కూడా అత్యధిక సీట్లు సాధించి, లోక్సభలో సత్తా చాటుతుందని పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణలో బలం పుంజుకుంటోందని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని మరీ, కేవలం 12 స్థానాలలోనే గెలిచిందన్నారు. కానీ ఇప్పుడు స్వతంత్య్రంగా 8 స్థానాలలో గెలిచి, మరో 19 నియోజక వర్గాలలో నువ్వా-నేనా అన్నట్లున్న పోటీలో రెండవస్థానంలో నిలిచిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ బీజేపీని చూసి భయపడుతున్నాయన్నారు. ప్రజాస్వామ్యమైన ఎన్నికలు జరిగి ఉంటే బీజేపీనే గెలిచేదన్నారు. మోదీ ఎల్లప్పుడూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అనే మాట్లాడేవారని, కానీ కేసీఆర్ ప్రభుత్వ పథకాలకు తానే ఇస్తున్నట్లు బిల్డప్ ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ ఉంటేనే తెలంగాణ ఉంటుందన్న భావన ప్రజలలో పాతుకుపోయేలా చేసాడని మండిపడ్డారు. కానీ ఇప్పుడు ఆ మితిమీరిన అహంకారమే దెబ్బకొట్టి పదవి నుండి తొలగించిందన్నారు.