‘ఎన్నికలలో ఉచిత పథకాలు ప్రజాకర్షణకు తాలింపులు’…ఈసీ
ఓటర్లను, ప్రజలను ఆకర్షించడానికి రాజకీయపార్టీలు ఇచ్చే ఉచిత పథకాలు తాలింపుల లాంటివని, వాటిని నియంత్రించడం చాలా కష్టమని కేంద్రప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా హామీలను గుప్పిస్తున్నారని, వాటిని ఐదేళ్ల పాటు మళ్లీ ఆ పార్టీలు గుర్తు పెట్టుకోవని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో, ఎలా అమలు చేస్తారో తెలుసుకునే స్వేచ్ఛ ఓటర్లకు ఉందని ఆయన పేర్కొన్నారు. వీటి కోసం ఒక నిర్ణీత నమూనాను ఈ మద్యనే అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. దీనివల్ల ప్రస్తుత ఓటర్లు వారి స్వప్రయోజనాల కోసం భావి, భవిష్య తరాలను తాకట్టు పెట్టే పరిస్థితి తగ్గుతుందని ఆశిస్తున్నానన్నారు. ఇలాంటి హామీలను ప్రకటించి నెగ్గేవారు వారి అలవాట్లను మార్చుకోవడం చాలా కష్టమని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పుడే, ఎన్నికలకు కేవలం నెలరోజుల ముందే పార్టీలకు ప్రజాసంక్షేమం గుర్తొస్తుందన్నారు. ప్రలోభాలకు లొంగకుండా ఓటర్లు ఓట్లు వినియోగించుకోవాలని ఆయన కోరుకున్నారు.