NewsTelangana

పీసీసీ చీఫ్ అయిన బుద్ధి మారలే- రేవంత్‌కు ఈటల చరుకలు

Share with

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ చురకలంటించారు. పీసీసీ అధ్యక్షుడు అయినప్పటికీ… రేవంత్ బ్లాక్ మెయిల్ చేయడాన్ని మర్చిపోలేదన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ వేర్వేరు కాదన్న ఈటల… పొత్తు ఎన్నికలకు ముందా.. తర్వాతా అనేది ప్రజలు మాట్లాడుకుంటున్నారన్నారు. నల్లగొండ జిల్లాలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఎదిగే క్రమంలో సంస్కారం, పద్దతి ఉండాలని…. రేవంత్ రెడ్డికి.. ఈటల హితవు పలికారు. నాలుగు పార్టీలు మారిన చరిత్ర పీసీసీ అధ్యక్షుడిదన్నారు. పూటకో మాట మాట్లాడే రేవంత్.. ఎవరి చరిత్ర ఏంటో తెలుసుకోవాలన్నారు. కొడంగల్‌లో ఓడితే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్న రేవంత్ తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మాటలను తెలంగాణ సమాజం అసహ్యించుకుంటోందని దుయ్యబట్టారు.

కష్టపడుతున్నా రిజల్ట్ రావటం లేదన్న నిరాశలో రేవంత్ ఉన్నాడని… ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను టీఆర్ఎస్‌లోకి పంపిన చరిత్ర కాంగ్రెస్ హైకమాండ్‌దేనన్నారు ఈటల. మంత్రి పదవి ఆఫర్ చేసినా రాజగోపాలరెడ్డి టీఆర్ఎస్‌లో చేరలేదని… మునుగోడు సమస్యలపై అసెంబ్లీలో బరిగీసి కొట్లాడింది రాజగోపాలరెడ్డిని ఈటల కితాబిచ్చారు. దేశంలో అంతరించిపోతోన్న పార్టీ కాంగ్రెస్ అని… సొంత రాష్ట్రం యూపీలోనే రాహుల్, ప్రియాంకకు దిక్కులేకుండా పోయిందన్నారు. ఫిరాయింపులకు ఆజ్యం పోసిందే కాంగ్రెస్ అంటూ విమర్శలు గుప్పించారు. నాడు చేసిన తప్పులే నేడు కాంగ్రెస్‌ను తినేస్తున్నాయన్నారు. కాంగ్రెస్ మిత్రులు హిమంత్ సోరెన్, అఖిలేష్ యాదవ్‌కు కేసీఆర్ డబ్బులు పంపింది నిజం కాదా అంటూ ప్రశ్నించారు ఈటల. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ అహంకారాన్ని బొంద పెడతామన్నారు. దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకురావటానికి కారణం కాంగ్రెస్సేనన్నారు. ప్రజలతో ఛీ కొట్టబడిన పార్టీ టీఆర్ఎస్ అని, అంతరించిపోతున్న పార్టీ కాంగ్రెస్ అంటూ తేల్చిచెప్పారు ఈటల.