Andhra PradeshHome Page Slider

ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం, వారు బాగుంటే ప్రజలు బాగుంటారు: సీఎం

Share with

తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ని ఉద్యోగ సంఘాల నేతలు శుక్రవారం కలిశారు. కొత్తగా జీపీఎస్ ను తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాల నేతలు సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తామని సీఎం జగన్ వారికి హామీ ఇచ్చారు. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములని, ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనదని సీఎం వారికి చెప్పారు. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.

అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డామని.. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి ప్రయత్నం చేసిన సందర్భాలు లేవని గుర్తు చేశారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాల్సి ఉందన్నారు. దీన్ని దష్టిలో ఉంచుకుని జీపీఎస్ ను తీసుకువచ్చామన్నారు. రిటైర్డ్‌ ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్ ను రూపొందించామని.. 62 ఏళ్లకు రిటైర్‌ అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచామన్నారు. ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలన్నారు. అయితే ఉద్యోగుల విషయంలో కేబినెట్ లో తీసుకున్న నిర్ణయాలను అరవై రోజుల్లో అమలు చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.