Home Page SliderNationalNews Alert

శూర్పణఖతో పోల్చారు.. మోదీపై పరువు నష్టం దావా వేస్తా..

Share with

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యల కేసులో కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీకి కోర్టు 2 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీనిపై ఆ పార్టీ నేత రేణుకా చౌదరి ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. రాహుల్‌ విషయంలో కోర్టులు చాలా వేగంగా స్పందించాయని పరోక్షంగా విమర్శలు చేశారు. 2018లో ప్రధాని మోదీ తనను శూర్పణఖతో పోల్చారని, ఈ వ్యాఖ్యలపై తాను పరువు నష్టం కేసు దాఖలు చేయబోతున్నానని ట్వీట్‌ చేశారు. ఈ కేసు విచారణను కోర్టులు ఎంత వేగంగా పూర్తి చేస్తాయో చూడాలన్నారు. రాహుల్‌ విషయంలో స్పందించినట్లే వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరిస్తాయో లేదో చూడాలని అన్నారు. 2018లో పార్లమెంట్‌లో ప్రధాని ప్రసంగిస్తుండగా ఓ విషయంపై తాను నవ్వానని, మోదీ తన నవ్వును శూర్పణఖ నవ్వుతో పోల్చారని రేణుకా చౌదరి తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. నిండు సభలో మోదీ మాట్లాడిన మాటలు తనను ఇబ్బందికి గురి చేశాయని.. ప్రధాని  చేసిన కామెంట్‌పై తాను చాలా బాధపడ్డానన్నారు. మోదీపై పరువు నష్టం దావా వేయబోతున్నానని రేణుక చౌదరి అన్నారు.